![]()
- సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ దివ్య నయన
- ప్రభుత్వ వైద్యుల సేవలు భేష్ అంటున్న గిరిజనలు
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 03
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పట్ల గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ దివ్య నయన అన్నారు. సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల అటవీ గ్రామాలైన బట్టిగూడెం, బత్తినపల్లిలో డాక్టర్ దివ్య నయన ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహించారు. వైద్య శిబిరంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. గర్భిణులను పరీక్షలు చేసి నెలనెల ఆరోగ్య కేంద్రానికి రావాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య నయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యశాలకు రావాలని, నీటి నిలువలు లేకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, దోమతెరలు తప్పనిసరిగా కట్టుకోవాలని సూచించారు.
ప్రభుత్వ వైద్యుల సేవలు భేష్ అంటున్న గిరిజనులు…
మండలంలోని ప్రభుత్వ వైద్యులు అటవీ గ్రామాల బాటపట్టారు. ప్రతి గ్రామాన్ని విడిచి పెట్టకుండా గ్రామాల్లో రైతులతో గ్రామస్తులతో సమావేశాలను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై సూచనలు సలహాలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రతిరోజూ ఏదో ఒక గ్రామానికి వెళ్లి అక్కడ శిబిరం ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు టీకాలు వేస్తున్నారు. ప్రతినెల గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సేవలు కల్పిస్తున్నారు. రోగుల నుండి రక్త నమూనాలు తీసుకోవడం, వారికి మందులు అందించడం, పలు సూచనలు సలహాలు ఇస్తూ వైద్య శిబిరాలు నిర్వహించి తమదైన ముద్రను వేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓ చింత సత్యనారాయణ, హెచ్ ఇ ఓ బాబురావు, ఎంఎల్ హెచ్ పీ లు సంధ్య, పార్వతి, దీప్తి, మౌనిక, హెల్త్ అసిస్టెంట్ వరప్రసాద్, సుబ్బారావు, వేణు, ఆశ కార్యకర్త జోగమ్మ తదితరులు పాల్గొన్నారు.


