![]()
అయోధ్యకు తరలివెళ్లిన శ్రీవారి లడ్డూ ప్రసాదం
మన భద్రాద్రి న్యూస్ బ్యూరో
స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు తరలి వెళ్ళింది. ఈ నెల 22న అయోధ్య శ్రీరామ మందిరంలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఈ మహోత్సవానికి వచ్చే భక్తులకు లక్ష శ్రీవారి లడ్డూ ప్రసాదం అందించేందుకు టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తిరుమల శ్రీవారి సేవాసదన్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి శుక్రవారము సాయంత్రం తరలించారు. అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి లక్ష లడ్డూలను పంపాలని టీటీడీ బోర్డు ఇది వరకే నిర్ణయించిందని ఈ సందర్బంగా టీటీడీ అదనపు ఈవో (ఎఫ్ఏసీ) వీరబ్రహ్మం తెలిపారు. 350 పెట్టెల్లో (బాక్సులు) ప్యాక్ చేసి నేరుగా ఏరోగ్రూప్ ద్వారా ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు రవాణా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూలను అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేయనున్నట్లు వీరబ్రహ్మం తెలిపారు.


