![]()
ఏపీలో వైఎస్ జగన్ 2019లో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఈ మధ్య కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టింది. ఇందుకోసం జీవో నంబర్ 114ను జారీ చేసింది.
అయితే పలు శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను తాము పూర్తి చేయిస్తామని ఉద్యోగుల్ని నమ్మబలుకుతూ దళారులు రంగంలోకి దిగారు. దీంతో ఎన్నాళ్లుగానో ఇందుకోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు వారికి భారీ మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి మోసపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో జరుగుతున్న మోసాలపై అధికారులు స్పందించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రలోభాలను నమ్మొద్దంటూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి క్రమబద్ధీకరణ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగులు ఎవరికైనా లంచం ఇచ్చినా, తీసుకున్నా ఇద్దరూ శిక్షార్హులేనని కమీషనర్ జె.నివాస్ తెలిపారు. ఏపీ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గతేడాది జీవో నంబర్ 114 జారీ చేసిందని, దీని ప్రకారం కాంట్రాక్టు సిబ్బంది వివరాల్ని ఆర్థిక శాఖ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఈ తరుణంలోనే కొందరు ఉద్యోగుల్ని దళారులు ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సాగుతోందన్నారు.


