Tuesday, March 24, 2026
HomeNational Newsఐపీఎల్‌ కు ముందు బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాక్..!

ఐపీఎల్‌ కు ముందు బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాక్..!

Loading

ఐపీఎల్‌ కు ముందు బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాక్..!

  • 357 ఆన్‌లైన్ గేమింగ్స్ వెబ్‌సైట్లు, 2400 బ్యాంకు అకౌంట్లు బ్లాక్
  • కోట్ల రూపాయల నగదు స్వాధీనం..!

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 23

ఐపీఎల్ సీజన్ మొదలైంది. ఐపీఎల్ వచ్చిందంటే చాలు.. ఆన్‌లైన్ బెట్టింగ్స్ యథేచ్ఛగా జరుగుతుంటాయి. ఈ బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్ల వలలో చిక్కుకుని అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికే చాలామంది ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి బలైపోయారు. ఇటీవల ఈ బెట్టింగ్ బాధిత కేసులు ఎక్కువగా పెరిగిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అందులోనూ ఈసారి ఐపీఎల్ ప్రారంభానికి ముందే కేంద్ర ప్రభుత్వం 300కి పైగా అక్రమ విదేశీ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్లాక్ చేసింది. ప్రభుత్వం శనివారమే ఈ సమాచారాన్ని అధికారకంగా వెల్లడించింది. ప్రభుత్వం ఇప్పటివరకు 357 అక్రమ వెబ్‌సైట్‌లు, యూఆర్ఎల్ లింకులను బ్లాక్ చేసింది.

ఈ వెబ్‌సైట్‌లు విదేశాల నుంచి నడిచే ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు లింక్ అయ్యాయి. ప్రభుత్వం ఇలాంటి అకౌంట్లను దాదాపు 700 వెబ్‌సైట్‌లను పర్యవేక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకుంది.

ఈ విదేశీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌లో కొన్ని భారతీయ కంపెనీలతో పాటు కొన్ని విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోలేదని గమనించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

తమ ఆదాయాన్ని ఆదాయ పన్ను శాఖకు లెక్కచెప్పకుండా అక్రమంగా దాచిపెడుతున్నారు. వచ్చే ఆదాయంపై కనీసం పన్నులు చెల్లించరు. అందువల్ల, డీజీజీఐ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69 కింద చర్య తీసుకుని 357 వెబ్‌సైట్‌లు, ఆయా సైట్ల యూఆర్ఎల్స్ కూడా బ్లాక్ చేసింది.

కోట్ల రూపాయల నగదు స్వాధీనం

దాదాపు 700 విదేశీ కంపెనీలు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్ వంటి ఆన్‌లైన్ బిజినెస్ రన్ చేస్తున్నాయి. వీటన్నింటిపైనా డిజీజీఐ నిఘా పెట్టింది. జీఎస్టీ చట్టం ప్రకారం.. ‘ఆన్‌లైన్ మనీ గేమింగ్’ అనేది ఒక ‘వస్తువు’గా పరిగణిస్తారు. అందుకే దీనిపై 28శాతం పన్ను విధిస్తారు. ఈ వ్యాపారంలో పనిచేసే కంపెనీలు జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. ఇటీవల డీజీజీఐ కొన్ని అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంది.

ఇందులో గేమ్ ప్లేయర్ల నుంచి డబ్బు దండుకునేందుకు వాడే బ్యాంకు అకౌంట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది. డీజీజీఐ, I4 సి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో దాదాపు 2 వేల బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేసింది.

అలాగే రూ.4 కోట్లు నగదును స్వాధీనం చేసుకుంది. కొన్ని వెబ్‌సైట్‌లలో యూపీఐ ఐడీలను లింక్ చేసిన 392 బ్యాంక్ అకౌంట్లను కూడా స్తంభింపజేసింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.122.05 కోట్లు జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఈ అకౌంట్లలో మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.

విదేశాల్లో భారతీయుల పై డీజీజీఐ చర్యలు

విదేశాల్లో ఉండి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్వహించే కొంతమంది భారతీయులపై కూడా డీజీజీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసిన 166 ఫేక్ అకౌంట్లను డీజీజీఐ ఇప్పటివరకు బ్లాక్ చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాదు.. ఈ ఆన్‌లైన్ గేమ్ నిర్వహించే ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇతరులపై కూడా దర్యాప్తు జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page