![]()
ఒంటరి, వితంతు మహిళల ఆర్థికాభివృద్ధికి ఐటీసీ బంగారు భవిష్యత్తు ఎన్జీవో సంస్థ తోడ్పాటు
- ఆనందం వ్యక్తం చేసిన ఐటీడీఏ పీవో బి రాహుల్
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో, నవంబర్ 13
ఒంటరి మహిళ మరియు వితంతు మహిళలకు స్వసక్తితో జీవించడానికి వ్యాపారంపరంగా చేయూత అందించి వారు ఆర్థికంగా నిలదొక్కుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి అలాగే సమాజంలో మంచి గుర్తింపు తేవడం కోసం ఐ టి సి బంగారు భవిష్యత్తు ఎన్జీవో సంస్థ తోడ్పాటు అందించడం చాలా సంతోషకరమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన ఐటీసీ బంగారు భవిష్యత్తు అతి నిరుపేద మహిళలకు సహాయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని, ఐటీడీఏ యూనిట్ అధికారులు ఐటిసి సంస్థ అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కావించి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పివో మాట్లాడుతూ ఐటిసి వారు నిర్వహిస్తున్న బంగారు భవిష్యత్తు అది నిరుపేద సహాయ కార్యక్రమం నిరుపేద మహిళలను గుర్తించి వారికి అనేక రంగాలలో శిక్షణ ఇప్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పలు రకాల కార్యక్రమాలను నిర్వహించి ఆర్థికంగా మెరుగుపరిచేందుకు తోడ్పడుతున్న ఐ టి సి సంస్థ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. భర్త లేని కుటుంబాల మహిళలకు వారి రెక్కల పై వారు నిలబడే భరోసా ఐటిసి సంస్థ వారు కల్పించారని అన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు, పేదలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం, పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యా పరంగా సహకారం అందించడం అలాగే పై చదువులు చదవడానికి ఆర్థికంగా తోడ్పాటు అందించి వారి భవిష్యత్తుకు చేదోడు వాదోడుగా ఉండి జీవితంలో స్థిరపడేలా ఐటిసి సంస్థ వారు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగా ఐటీసీ బంగారు భవిష్యత్తు బంధన్ స్వచ్ఛంద సంస్థ అతి నిరుపేదలైన మహిళలకు ఒక్కొక్కరికి 13 వేల రూపాయల విలువ గల సామాన్లు మొత్తం 40 మందికి ఐదు లక్షల 20వేల వ్యయంతో కుట్టు మిషన్లు, కిరాణా వస్తువులు, బట్టల తోపుడు బండ్లు అందించి వారు అమ్మకాలు జరుపుకోవడానికి మార్కెట్ సౌకర్యం కల్పించడం వలన ఆర్థికంగా నిలదొక్కుకుంటారని, నిరుద్యోగులైన మహిళలకు ప్రథమ స్వచ్ఛంద సంస్థ ద్వారా వృత్తి నైపుణ్యాలలో మెలుకువలు అందించి బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ శిక్షణలు అందించి వారికి కావలసిన మెటీరియల్ అందిస్తున్నందున వారి గ్రామాలలోనే జనాభా అధికంగా ఉన్న ప్రదేశాలలో షాపులు పెట్టుకొని జీవనోపాధి పొందవచ్చని మహిళలకు సూచించారు. బైప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన పశు సఖి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గొర్రెలు, మేకల పెంపకం చేస్తూ లబ్ధి పొందుతున్న మహిళలను వాటి విధివిధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్తు ద్వారా చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో నిరుపేదలైన మహిళలు భాగస్వాములై వాటిని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.
అనంతరం మహిళలకు బట్టల తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, కిరాణా వస్తువులు, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్ శిక్షణ పూర్తి చేసిన విద్యార్థినిలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఐ టి సి పీఎస్పీడీ డిప్యూటీ జనరల్ మేనేజర్ చంగల్ రావు, ప్రోగ్రాం మేనేజర్ జయప్రకాష్, బంధన్, ప్రథమ్, బైప్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, మహిళలు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.


