![]()
-జీతాలు లేక బ్రతికేదెట్లాని ప్రశ్నిస్తున్న కార్మికులు
-కార్మికులపై ప్రభుత్వం కక్షగట్టిందంటూ ఆవేదన
-జీతాలు లేక ఎనిమిది నెలలుగా పస్తులు
-గ్రామపంచాయతీ కార్మికులపై ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష
-ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకోలు
తిరుమలాయపాలెం, మన భద్రాద్రి న్యూస్
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోగల నాలుగు మండలాలలో సుమారు 190 మందికి పైగా గ్రామపంచాయితీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత ఎనిమిది నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామపంచాయతీల్లో వారి బాధలు చూడలేక కార్యదర్శులు బయట అప్పుతెచ్చి రెండు, మూడు నెలల జీతాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామపంచాయతీలను నడపడం మునుపెన్నడూ లేనంత భారంగా మారిందని, గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే బాగుండేదని కార్యదర్శులు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, హరితహారం, వైకుంఠధామాలు, వీధి దీపాలు, డంపింగ్ యార్డ్స్, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులు జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, అప్పు చేసి బ్రతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్మికులు నో వర్క్, నో పే, లీవ్ లెటర్ పెట్టి కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మాపై ప్రభుత్వం ఎందుకింత కక్షగట్టిందని, అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా జీతాలు ఇచ్చి ఆదుకోవాలని, గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూరీడు పొడవక ముందే ఇంటింటా తిరుగుతూ చెత్తబండి వచ్చిందమ్మా.. తడి పొడిచెత్త వేరుచేసి ఇవ్వండమ్మా.. అంటూ గ్రామంలో తిరుగుతూ ఊరును శుభ్రం చేస్తున్న గ్రామపంచాయితీ కార్మికుల బాధలు వర్ణణాతీరం. పొద్దంతా కూలీ పనిచేసి వచ్చిన డబ్బులతో పూట గడుపుకొనే ఈ రోజుల్లో ఎనిమిది నెలులుగా వారికి జీతాలు లేకపోవడంతో వారి బ్రతుకులు రోజురోజుకు దుర్భరంగా మారుతుంది.


