![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 30
డాక్టర్లు లేని కాలంలో మంత్రసానిగా వ్యవహరించి,గర్భిణులు హాస్పటల్ కు వెళ్లి వృథా ఖర్చు చేయకుండా, ఎంతో నేర్పుతో, చాకచక్యంతో సాధారణ ప్రసవం చేయడంతో అనేకమంది గర్భిణీల కడుపు కోతకు దూరం చేయడంతో పాటు, ఎంతోమంది బిడ్డల జన్మకు కారకురాలైన ఆదర్శ మాతృమూర్తి, సహజ సిద్ధ ప్రకృతి వైద్యురాలైన బానోత్ ద్వాళి గురువారం ఆకస్మిక మరణంతో స్థానిక మహిళలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. డెబ్భై ఏళ్ల క్రితం తెలుగునాట గ్రామాల్లో ప్రసవాలు ఇళ్లలోనే జరిగేవి. అలోపతీ వైద్యులు లేని రోజుల్లో పల్లెటూళ్లలో మంత్రసానులే మహిళలకు కాన్పులు చేసేవారు. గర్భిణీలకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా పిల్లలు కనడానికి ఈ సాంప్రదాయ మంత్రసానులు తోడ్పడేవారు. ఈ నేపథ్యంలో ద్వాళి భర్త మద్యా నాయక్ సమాజంలో పేరున్న వ్యక్తి. ద్వాళి లేని లోటు పూడ్చలేనిదని, లచ్య తండా, సింగ్యతండా వాసులకు ఎన్నో రకాలుగా ఆరోగ్య సలహాలు, సూచనలు ఇస్తూ సేవలు అందించారని కొనియాడారు. స్థానిక ప్రజలు, యువకులు, ఉద్యోగస్తులు మాట్లాడుతూ మా అందరి తల్లుల సుఖప్రసవానికి ఆమె చేతులు దైవంతో సమానమని, హస్తవాస్తి అని కొనియాడారు. మంత్రసాని దాది అనే మారుపేరుతో అందరూ ఆమెను పిలిచేవారని, ప్రస్తుతం గ్రామాలలో ఉన్న 35 నుంచి 40 సంవత్సరాల యువకులు మంత్రసాని దాది చేతుల లో పుట్టిన వారిని గుర్తు చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా తనకున్న నైపుణ్యంతో పల్లె వైద్యురాలిగా ద్వాళి పేరుపొందింది. దాది అందరిపై ప్రేమా, ఆప్యాయత చూపించేవారు. ఆమె మరణ వార్త విని తండా ప్రజలు, యువకులు మరియు టేకులపల్లి మండల లచ్య తండా ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని ప్రకటించారు.


