![]()
- ఆదివాసీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ
- ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించిన దుమ్ముగూడెం పోలీసులు
దుమ్ముగూడెం, మన భద్రాద్రి బ్యూరో
ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మండలం లోని నారాయణరావుపేట గ్రామ పంచాయతీలో గల సిరిగుండం ఆదివాసి గుత్తి కోయ గ్రామంలో దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. దుమ్ముగూడెం స్థానిక పిహెచ్సి వైద్య సిబ్బంది సహకారంతో సిరిగుండం ఆదివాసి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి, గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులను అందించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వర్ ఐపిఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన మరియు మారుమూల గ్రామాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కాలంలో వర్షాలు అధికంగా పడి దోమల వలన డెంగీ, మలేరియా వంటి విషపూరిత జ్వరాలు ప్రభలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసరమైతే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించి సహాయం పొందాలని తెలిపారు. దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల చేత గ్రామంలోని చిన్న పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను వారికి ఉచితంగా అందచేయడం జరిగింది. గ్రామంలో నివసిస్తున్న 52 కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులను పొందారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుమ్ముగూడెం పోలీసులను ఏఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం ఇన్స్పెక్టర్ అశోక్, దుమ్ముగూడెం పిహెచ్సి డాక్టర్ పుల్లారెడ్డి, ఎస్సై గణేష్, ఆర్ఎస్సై హరీష్ మరియు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


