![]()
-ఏడిఏ వాసవి రాణి
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 31
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మండలంలోని బోడు గ్రామంలో నకిలీ విత్తనాలపై రైతులకు ఇల్లందు డివిజన్ ఏడిఏ పి వాసవి రాణి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన ఆధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. బీజీ-3 పేరుతో చలామణి అవుతున్న హెచ్ టి పత్తి విత్తనాలకు జీఈఏసి అనుమతి లేనందున ఈ రకం విత్తనాలు కొనడం, అమ్మడం, సాగు చేయడం నేరమన్నారు. నిర్ణీత ఫార్మాట్ లో ఉన్న బిల్లు, దుకాణదారిని అడ్రస్, పేరు, సీడు లైసెన్సు నంబరు, జీఎస్టీ నంబరు మొదలగునవి ఉన్న రసీదు మాత్రమే రసీదుగా అంగీకరించాలని తెలిపారు. కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రసీదుపై విత్తనం కంపెనీ పేరు, విత్తనం రకం పేరు, లాట్ నెంబర్, గడువు తేదీ, డీలర్ సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, డబ్బాలో ఉన్న విత్తనాలను, గడువు దాటిన విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో అన్నపూర్ణ, ఏఈఓ రమేష్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


