![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, మే 30
ములుగు క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను గురువారం సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జిల్లా నాయకులు తుపాకుల నాగేశ్వరరావులు కలిసి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. వారు మాట్లాడుతూ
సీతారామ ప్రాజెక్టు నీళ్లను రోళ్లపాడు రిజర్వాయర్ లోకి మళ్ళించి ఏజెన్సీ ప్రాంతానికి సాగునీరు అందించాలని, భూగర్భ గనుల ద్వారానే బొగ్గును వెలికి తీయాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని, గ్రామపంచాయతీలలో, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని, కొమరారం, బోడులను మండలాలుగా ప్రకటించి, ఇల్లందుని రెవిన్యూ డివిజన్ గా గుర్తించాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, గుండాల మండలంలోని పిల్లివాగు, కరకగూడెం మండలంలోని పులుసు బొంత ప్రాజెక్టులకు నిధులు కేటాయించి నిర్మాణం చేపట్టాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి – ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాలు అరికట్టి, సబ్సిడీపై రైతులకు విత్తనాలు, ఎరువులు అందజేయాలని, రైతు రుణాలను మాఫీ చేయాలని, ఇండ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి, పక్కా గృహాలు మంజూరు చేయాలని తదితర ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. మంత్రి సీతక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.


