Tuesday, March 24, 2026
HomeHyderabadబీజేపీలో చేరిన గువ్వల.. బీఆర్ఎస్‌పై సంచలన వాఖ్యలు

బీజేపీలో చేరిన గువ్వల.. బీఆర్ఎస్‌పై సంచలన వాఖ్యలు

Loading

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, ఆగస్టు 10

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సమక్షంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరారు. గువ్వలకు రామచంద్రరావు కాషాయపు కండువా కప్పి, పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన గువ్వల బాలరాజు బీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ రెండు పార్టీలు దోపిడీ చేస్తున్నాయి..

దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాయని గువ్వల బాలరాజు ఆరోపించారు. దోపిడీని అరికట్టడానికి బీజేపీ పోరాటాలు చేస్తోందని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. మోదీ దేశానికి ఒక ఆర్కిటెక్చర్‌ను అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక ఇంపోర్ట్ లీడర్షిప్ కలిగిన పార్టీ అని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్‌లో దళిత వర్గాలకు చోటులేదు..

తాను అవకాశవాది కాదని.. అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వాడిని అని గువ్వల ధీమా వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్‌లో చేరమని తనని ఎవరు అడగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌లో దళిత వర్గాలకు చోటులేదని విమర్శించారు. రాజకీయంగా తనకు అచ్చంపేట జన్మనిచ్చిందని, కానీ అక్కడి ప్రజలకు చెప్పకుండా రాజీనామా చేసినందుకు క్షమించాలని కోరారు. రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ నుంచి కూడా పిలుపు వచ్చిందని చెప్పారు.

అందుకే బీజేపీలో చేరాను..

రాష్ట్రంలో పొలిటికల్ మాస్టర్ “కీ” బీజేపీ అని అందుకే బీజేపీలో చేరడం జరిగిందని గువ్వల స్పష్టం చేశారు. బీజేపీ కుటుంబంలో ఒక సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభిస్తానని తెలిపారు. నిబద్ధతతో కూడిన కార్యకర్తగా బీఆర్ఎస్‌లో పని చేశానని.. కానీ బీఆర్ఎస్‌లో క్రెడిబిలిటీ లేని రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు భిక్ష ఇచ్చిందని.. కానీ కేసీఆర్ ఎవరికి భిక్ష ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుస్తారని ఎవరి భిక్ష వల్ల గెలవరని గువ్వల ఉద్ఘాటించారు.

నా ఓటమికి వారే కారణం..

గత ఎన్నికల్లో తన ఓటమి కోసం బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నం చేశారని గువ్వల బాలరాజు మండిపడ్డారు. బీజేపీలో చేరుతానంటే తనపై, తన సతీమణిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ అధికారం కావాలని చూస్తోంది, కాంగ్రెస్ మళ్ళీ రెన్యువల్ కావాలని చూస్తోందని చెప్పుకొచ్చారు. ఏది కావాలన్న ఎన్నికలు రావాలి.. ఏదైనా ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అచ్చంపేట నుంచే మొదలుపెడతామని గువ్వల ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page