![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నేడు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో భాజపా నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు.
కొన్ని రోజుల క్రితం దుండగుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. ఇక్కడికి రామచందర్ రావు వెళ్తారనే సమాచారంతో హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన నేడు హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది.
- హౌస్ అరెస్టు సరికాదు: గంగిడి మనోహర్రెడ్డి
రామచందర్ రావును గృహనిర్బంధం చేయడం సరైంది కాదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపక్ష పార్టీల నాయకులను నిర్బంధించడం మానుకోవాలని చెప్పారు. నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవాలని చూడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కారు కూడా ముందస్తు అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని దుయ్యబట్టారు. ఇదేవిధంగా కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని గంగిడి మనోహర్రెడ్డి హెచ్చరించారు.


