![]()
రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా మనమంతా కలిసి పని చేయాలి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఖమ్మం, మన భద్రాద్రి బ్యూరో,
రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా మనమంతా కలిసి పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ తో కలిసి పాల్గొని, మాట్లాడుతూ.. అందరికీ ఒకేలా చట్టం ఉండేలా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం తో పాటు ప్రజలకు రాజ్యాంగం ఔన్నత్యాన్ని చెప్పేందుకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని అన్నారు.
స్వాతంత్ర్యం కోసం మన పూర్వీకులు చేసిన పోరాటాలు మర్చిపోవద్దని, స్వాతంత్ర్యం కంటే ముందు మన పరిస్థితి, రాజ్యాంగం లేకపోతే మన బ్రతుకు ఎలా ఉండేదో స్వేచ్ఛ ఉంటుందా వంటి పలు అంశాలను గుర్తుంచుకోవాలని, కేంద్రం ప్రస్తుతం రాజ్యాంగ స్ఫూర్తి మర్చిపోయి అధికారం మాత్రమే చేపట్టాలని ప్రాంతాలకు, మతాలకు చిచ్చుపెడుతూ అభివృద్ధిని విస్మరిస్తుందని, సామాన్య ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు స్వర్ణ కుమారి, బచ్చోడు మాజీ సర్పంచ్ హరిత రెడ్డి, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.


