![]()
రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం
-మఠంలంక గ్రామంలో సంతాప సభ
గుండాల, మన భద్రాద్రి న్యూస్
మండల పరిధిలోని మఠంలంక గ్రామంలో ఆదివారం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ సంతాప సభను నిర్వహించారు. ఈ సంతాప సభలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) జిల్లా నాయకులు మాచర్ల సత్యం, పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్, జిల్లా నాయకులు వాంకుడోత్ అజయ్, గుండాల, ఆళ్ళపల్లి మండలాల సంయుక్త కార్యదర్శి కొమరం శాంతయ్యలు మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ కంట్రోల్ చైర్మన్ గా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతూ జూలై 16 న అకాల మరణం చెందారని, వారి మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
రాయల చంద్రశేఖర్ 1975 ఎమర్జెన్సీ నాటికి చదువు వదిలేసి విప్లవోద్యమ నిర్మాణం కోసం రహస్య జీవితానికి వెళ్ళాడని, మణుగూరు, అశ్వాపురం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలలో ప్రతిఘటన దళంలో పనిచేశాడని, ఎమర్జెన్సీ అనంతరం లీగల్ గా ఖమ్మం, వరంగల్ జిల్లాలలో పనిచేశాడని గుర్తు చేశారు. రాయల చంద్రశేఖర్ యాభై ఏళ్లు విప్లవ జీవితం ఎంతో గొప్పదని, పార్టీకి కట్టుబడి నిబద్దతగా పనిచేశాడని, రాజకీయంగా, సిద్ధాంతపరంగా సరైన పంథా కోసం నిలబడ్డ గొప్ప మేధావి అని వారు కొనియాడారు. రాయల చంద్రశేఖర్ ఉద్యమాన్ని బలోపేతం చేయుటకు ప్రజల్లో మమేకమై పనిచేసిన గొప్ప నాయకుడని అన్నారు. ఆయన ఆశించిన అంతరాలు లేని సమాజం కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని అన్నారు.
జూలై 25 వరకు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో రాయల చంద్రశేఖర్ సంతాప సభలను నిర్వహించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) గుండాల, అళ్ళపల్లి మండలాల నాయకులు తెల్లం రాజు, ఈసం కృష్ణ, సనప కుమార్, పూనెం మంగయ్య, పూనెం లక్ష్మయ్య, బోర్రా వెంకన్న, ఈసం సింగన్న, కోడూరి జగన్, ఈసం చంద్రన్న, కల్తీ రామన్న, కుంజ నరేష్, తదితరులు పాల్గొన్నారు.


