![]()
తెలంగాణలో రైతులకు ఇంతవరకూ రైతు బంధు నిధులే సరిగా రాలేదు. ఇక రుణమాఫీ జరిగే పనేనా అని చాలా మంది రైతులు దానిపై ఆశలు వదులుకోవాలా అని ఆలోచిస్తున్న టైంలో..
తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక సమాచారం వస్తోంది. అదేంటంటే.. రుణమాఫీ చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు.. రుణమాఫీ చేసేందుకు డబ్బు కోసం అప్పు కూడా చెయ్యాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. రైతుల రుణమాఫీ కోసం బడ్జెట్లో కేటాయింపులేవీ చెయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెయ్యాలనుకుంటోంది. ఎందుకంటే.. రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీల్లో ఒకటిగా ఉంది. ఇది అమలు కాకపోతే, రైతుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని చూసే ప్రమాదం ఉంది. అందువల్ల సీఎం రేవంత్ రెడ్డి తాజా ఆదేశాలతో.. బడ్జెట్లో నిధుల కేటాయింపుపై అధికారులు ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నారు.
కాంగ్రెస్ రైతులకు ఇచ్చినవి 3 హామీలు. ఒకటి రైతు భరోసా, 2 రుణమాఫీ, 3 రైతు కూలీలకు కూడా రైతు భరోసా. వీటిలో ఏదీ ఇప్పటివరకూ అమలు కాలేదు. రైతు భరోసా బదులు ప్రస్తుతానికి రైతు బంధును అమలు చేస్తున్నారు. వానాకాలం నుంచి రైతు భరోసాని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. రైతు బంధు కింద రైతులకు ఏటా ఎకరానికి రూ.10వేలు ఇచ్చేవారు. అదే రైతు భరోసా అమలైతే.. ఎకరానికి రూ.15వేలు ఇస్తారు. రైతు కూలీలకు ఏటా ఎకరానికి రూ.12వేల చొప్పున ఇస్తారు. గత బడ్జెట్లో రైతు బంధుకి రూ.15,070 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం 54 ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధును అమలుచేసింది. కొత్త ప్రభుత్వం మాత్రం రైతు భరోసాపై కొన్ని పరిమితులు విధించాలనుకుంటోంది. ముఖ్యంగా 10 లేదా 5 ఎకరాల లోపు రైతులకు మాత్రమే వర్తింపజెయ్యాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక మార్గదర్శకాలు ఇంకా రాలేదు.
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్టర్లు, వ్యాపారులు, సినీ నటులకు కూడా రైతు బంధు ఇచ్చిందనే విమర్శలున్నాయి. ఇంకా చెప్పాలంటే.. రైతు బంధు వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో చాలా మంది వ్యవసాయ భూములు కొనుక్కున్నారు. కానీ వారు ఆ భూముల్లో పంటలు వెయ్యలేదు. ప్రభుత్వం నుంచి రైతు బంధు మాత్రం పొందేవారు. ఇలా చాలా అక్రమాలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిపై ప్రక్షాళన చెయ్యాలనుకుంటోంది.
రైతు రుణమాఫీ అమలుచెయ్యాలంటే రూ.40వేల కోట్లు కావాలి. అసలే ఖజనాలో మనీ లేదు. అదనంగా రూ.40వేల కోట్లు ఎక్కడి నుంచి తేవాలన్నది పెద్ద ప్రశ్న. గత ప్రభుత్వం లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అప్పుడు రుణమాఫీ రూ.22వేల కోట్లు ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.13వేల కోట్ల వరకూ మాఫీ చేసింది. మిగతా మాఫీ అలాగే పెండింగ్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల వరకూ రుణమాఫీ చేస్తామంది. అందుకే భారీగా డబ్బు కావాల్సి ఉంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Courtesy : news18 telugu


