![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జులై 04
మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ మరియు స్కూల్ లలో గురువారం గంజాయి లాంటి మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, నూతన చట్టాలు, ఈవ్ టీజింగ్ లాంటి పలు విషయాలపై గుండాల సీఐ ఎల్ రవీందర్ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి, మద్యపానం లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు బానిస కావద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా స్కూల్లో గానీ, కాలేజీలోగానీ గంజాయి లాంటి మత్తు పదార్థాలు అమ్మితే స్కూల్ యాజమాన్యానికి, పోలీసు వారికి వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. అదేవిధంగా ఈవ్ టీజింగ్ కి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కొత్తగా వచ్చిన విద్యార్థులను తమ సోదరులుగా భావించి స్నేహపూర్వకంగా మెలగాలని, ఈ మధ్యకాలంలో జరిగే సైబర్ క్రైమ్ ల గురించి వివరించారు. అపరిచితులకు తమ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ తెలుపవద్దని, జాబులు ఇప్పిస్తామని, లోన్ ఇప్పిస్తామని అపరిచితులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని, అదేవిధంగా 18 సంవత్సరాల నిండని, లైసెన్స్ లేని విద్యార్థులు బండ్లు నడపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు


