![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: నగరానికి అగ్నిప్రమాదాలు (Fire Accidents) వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
తాజాగా భాగ్యనగరంలో రెండు వేర్వేరుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు (Police), అగ్నిమాపక సిబ్బంది (Fire Fighters) ఆయా సంఘటనల ప్రదేశాలకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆసిఫ్నగర్ (Asifnagar)లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక జీరా ప్రాంతంలోని క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేసారు. ప్రమాద సమయంలో మూడంస్తుల భవనంలో 15 మంది ఉన్నట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. భవనం లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని, కొంతమేర ఆస్తినష్టం జరిగిందని పోలీసులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్లో మంటలు..
హైదరాబాద్, జీడిమెట్లలోని శ్రీనివాస్ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో వంట గదిలో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ వద్ద మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు సిలిండర్ను బయటకు తీసుకువచ్చి పడేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కాకుండా కట్టడి చేశారు. దీంతో సమీపంలో నివసించే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.కాగా శుక్రవారం రాత్రి కొండాపూర్లోని కదిరిస్ అపురూప అపార్ట్మెంట్లోని చివరి అంతస్తులో మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్ వాసులతో పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందిచండంతో పెను ప్రమాదం తప్పింది.


