![]()
అదనపు చార్జీలు వసూలు చేయట్లేదు
- మేడారంకు బస్సులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క – సారక్క జాతర బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మేడారం జాతరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ విషయంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, మేడారం జాతరకు ఆర్టీసీ 6000 ప్రత్యేక బస్సులు నడుపుతోందన్నారు. మేడారం జాతరలో 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నారు. ఇందు కోసం ఈ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా కాజీపేట నుంచి కూడా బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు. మేడారం జాతరకు మహాలక్ష్మి స్కీమ్ అమల్లో ఉంటుందన్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని, ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయట్లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.


