![]()
-ప్రారంభించి నెలలు గడుస్తున్నా కొన ‘సాగుతున్న’ పనులు
-డ్రైనేజీలో పడి ఎంతోమంది గాయాలు పాలవుతున్నా పట్టించుకోని యంత్రాంగం
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని గుర్రాయిగూడెం గ్రామంలో డ్రైనేజీ పనులు సగంలోనే ఆపివేశారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని బానోత్ బోధ్యా ఇంటి వద్ద నుండి అవులూరి రామిరెడ్డి ఇంటి వరకు 95 మీటర్ల డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాంట్రాక్టర్ ఈ పనులను ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో గ్రామస్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. గ్రామంలోని డ్రైనేజీకి ఆనుకొని ఉన్న తన పొలంలోకి నీరు వస్తుందని, డ్రైనేజ్ నిర్మాణాన్ని గోదా నాగేశ్వరరావు అడ్డుకుంటున్నాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తన పొలంలోకి డ్రైనేజీ లేకపోయినా నీరు పోతుందని, గత 30 సంవత్సరాల నుంచి వర్షపు నీరు పొలంలోకి పోవడం జరుగుతుందని, ఇప్పుడు డ్రైనేజీని అడ్డుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ పనులు ప్రారంభించినప్పుడే అధికారులకు ఆయన తన సమస్య వివరించి ఉండాలని, ఇప్పుడు సగం డ్రైనేజీ పనులు అయిన తర్వాత అడ్డుకోవడంలో రాజకీయ కోణం ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మూడు నెలలు కావస్తున్నా ఇంటి ముందు గోతులు త్రవ్వి ఉండడంతో చాలా సార్లు అందులో పడి ఆసుపత్రి పాలయ్యామని, వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ఇంట్లో నుంచి రోడ్డు మీదికి తీయాలన్నా వీలు కావడం లేదని, త్వరగా డ్రైనేజీ నిర్మించి ఈ సమస్యలను తీర్చాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు. గ్రామానికి చెందిన సీతమ్మ మాట్లాడుతూ కావాలనే డ్రైనేజీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని, నేను ఈ గొయ్యిలో పడి ఆసుపత్రి పాలయ్యానని తెలిపింది. గోపమ్మ మాట్లాడుతూ మాకు డ్రైనేజీ కావాలని, మేము నీళ్లు తెచ్చుకోవాలన్నా మా ఇంటి ముందు పెద్ద గొయ్యి లాగా త్రవ్వి వదిలేశారని, దాని వలన మేము చాలా ఇబ్బంది పడుతున్నామని ఆమె వాపోయింది.


