![]()
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం
- సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు
- నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
కొత్తగూడెం, మన భద్రాద్రి న్యూస్ బ్యూరో
ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్ నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించి, పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
గంజాయి, పీడీఏస్ బియ్యం అక్రమ రవాణా, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయిని అమ్మే వ్యక్తులతో పాటు గంజాయికి అలవాటు పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దొంగతనం కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి భాదితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు. సైబర్ నేరగాళ్లు అమాయకుల వద్ద నుండి డబ్బులు దోచుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారని, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్), వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన షీ టీమ్స్ ఆవశ్యకతను గురించి వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్ర రావు, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


