![]()
-ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏఐటీఎఫ్) పిలుపు
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 30
మండలంలోని పోతిరెడ్డిగూడెం, కాచనపల్లి గ్రామాలలో ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏఐటీఎఫ్) ఆధ్వర్యంలో సంతాల్ ఆదివాసీల తిరుగుబాటును స్మరించుకుంటూ ఆదివారం సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీఎఫ్ జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణలు మాట్లాడుతూ బ్రిటిష్ వలస వాదానికి వ్యతిరేకంగా, భారత స్వతంత్ర పోరాటంలో జూన్ 30, 1855 అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజని, ఈరోజే స్థానిక వడ్డీ వ్యాపారస్థులపై తిరుగుబాటు చేసిన రోజని, దేశవ్యాప్తంగా సంతాల్ ఆదివాసీల తిరుగుబాటును స్మరించుకోవాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం (ఏఐటిఎఫ్ ) పిలుపులో భాగంగా ఈ సదస్సులను నిర్వహించినట్లు వారు తెలిపారు. సంతాల్ ఆదివాసీ తిరుగుబాటులను స్మరించుకుంటూ భారతదేశవ్యాప్తంగా నివసిస్తున్న ఆదివాసీల హక్కులు, భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం పారా మిలిటరీ దళాలను పంపి మారణ హోమం సృష్టిస్తుందని, ఈ ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిగూడెం, కాచనపల్లి ఆదివాసీ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


