![]()
- రాహుల్ వ్యాఖ్యలపై థరూర్
ఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఓ వైపు భారత్ను మిత్రదేశం అంటూనే మన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
రష్యా, భారత్..వాటి డెడ్ ఎకానమీ (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థ)లను మరింత దిగజార్చుకోనీయండంటూ చేసిన వ్యాఖ్యానించారు. వీటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడంపై ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతివ్వడానికి రాహుల్కు మరేమైనా కారణాలు ఉండొచ్చన్నారు. అయితే, రాహుల్ అభిప్రాయంపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు.
భారత్- అమెరికా సంబంధాలపై థరూర్ మాట్లాడుతూ..వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామిగా వాషింగ్టన్ న్యూదిల్లీకి చాలా ముఖ్యమైందన్నారు. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకు దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఇరుదేశాల మధ్య సముచిత వాణిజ్య ఒప్పందం కుదిరేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇటీవల థరూర్కు కాంగ్రెస్ పార్టీకి మధ్య అభిప్రాయభేదాలు తెరపైకి వస్తున్నాయి. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీలో అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్పై థరూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తుందనే కారణం చూపుతూ.. భారత నుంచి దిగుమతులపై ట్రంప్ 25శాతం సుంకాలతో పాటు పెనాల్టీలు విధించారు. ఈ క్రమంలోనే రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్యం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. ఇరు దేశాలు ఆర్థికవ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలను సమర్థించారు. దీనిపై భారత ప్రధాని మోదీ ఘాటుగా స్పందించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు పెడుతోందన్నారు. అంతేకాదు.. ట్రంప్ టారిఫ్ల వేళ స్వదేశీ ఉత్పత్తులను పెంచాలంటూ పిలుపునిచ్చారు.


