![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఇక్ఫాయ్, క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైపాల్ రెడ్డి అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి పీవీ నర్సింహా రావు తర్వాత.. మళ్లీ అంత పేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో మార్పుల కోసం జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గాలని ఆయన పదే పదే చెప్పేవారని అన్నారు. జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటులోనూ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని.. ఆయన లేకుంటే తెలంగాణ సాకారం అయ్యేదే కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి ఎంతో చొరవ చూపారని సోనియా గాంధీ కూడా ఓసారి చెప్పారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. జైపాల్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంతపరంగా మాత్రమే విభేదాలు ఉండేవి. 40 ఏళ్ల పాటు అజాతశత్రువుగా కొనసాగారు. సమాచార హక్కు చట్టం రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర మరువలేం. సంస్కరణల అమలుకు కూడా జైపాల్ రెడ్డి ఎంతో తాపత్రయపడేవారని అన్నారు. ఇవాళ ఐడియాలజీ పాలిటిక్స్ కనుమరుగై.. స్విగ్గీ పాటిలిక్స్ వచ్చాయని అన్నారు. రాజకీయాలు ఇంత స్థాయిలో దిగజారిపోతాయని ఏనాడూ ఊహించలేదని తెలిపారు. ప్రజాస్వామిక విలువలు తగ్గి.. పొలిటికల్ మేనేజ్మెంట్ పెరిగిందని చెప్పారు.


