![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్:
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
2.5 శాతం డీఏ వల్ల ఆర్టీసీపై ప్రతీ నెల 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తరువాత మహిళా ప్రయాణీకుల సంఖ్య దాదాపు ప్రతి రోజూ 14 లక్షల మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారని, దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మదిలో నుండి వచ్చిన ఈ ఆలోచన మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి నుండి అమలులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుంది. మహిళా ప్రయాణీకులు అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగింది. మహిళా సమైక్య సంఘాల చేతే బస్సులు కొనిపించి, ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు పెట్టించి, మహిళలు ఆదాయాన్ని అర్జించాలని భావించిన మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు అధికారులతో పలుమార్లు ఆయన చర్చించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాల చేత ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన పెట్టీ బస్సులకు యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించిందని, రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


