Tuesday, March 24, 2026
HomeTelangana Newsఆ విషయంలో రైతుల ఉసురు పోసుకుంటున్నారు..!

ఆ విషయంలో రైతుల ఉసురు పోసుకుంటున్నారు..!

Loading

ఆ విషయంలో రైతుల ఉసురు పోసుకుంటున్నారు..!

  • కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

రైతు కుటుంబాలకు ధీమానిచ్చే రైతు బీమాను అటకెక్కిస్తున్నారని, ఇది ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రైతు బీమా పథకం పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు.. ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

అలాగే ఫ్రిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన రూ. 775 కోట్ల ప్రీమియం మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయమని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతు కుటుంబాలకు శాపంగా మారుతున్నదని అన్నారు. అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా? లేదా అటకెక్కించారా అనే అనుమానం కలుగుతుందన్నారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అని, యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు.. అని మేము అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మార్చి 31 లోగా మొత్తం చెల్లిస్తామని చెప్పి మాట తప్పారని, మొత్తంగా రైతు బంధు పథకాన్ని ప్రశ్నార్థకం చేసారని దుయ్యబట్టారు. రుణమాఫీ హామీ విషయంలో మేము వెంటబడితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని, సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురుపోసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు రైతు కుటుంబాలకు ధీమా ఇచ్చే రైతు బీమా పథకాన్ని లేకుండా చేస్తున్నారని, ఇంతకంటే అమానుషం ఏమైనా ఉంటదా? ఇది కచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి, మంత్రులకు రైతు కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదా? అని నిలదీశారు. వివిధ కారణాలతో గడిచిన మూడు నెలల్లో సుమారు వందకు పైగా రైతులు చనిపోయినట్లు తెలుస్తోందని, ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాలకు రైతు బీమా సాయం అందకుండా పోయిందని తెలిపారు. ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయి, మరోవైపు రైతు బీమా అందక ఆ కుటుంబాలు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాయని చెప్పారు. ఇక రైతు కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 5 లక్షలు చెల్లించి, ఎల్.ఐ.సి కి పెండింగ్ లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page