![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: కల్తీ కల్లు బాధితులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులతో కొన్ని ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లను మూసివేశారు.
దాంతో కల్తీ కల్లుకు అలవాపటుపడ్డ కొందరు.. ఎక్కడా కల్లు దొరక్కపోవడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వారిని కుటుంబ సభ్యులు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి తీసుకువస్తున్నారు. బుధవారం అవుట్ పేషెంట్ (ఓపీ) బ్లాకుకు సుమారు 100 మంది రోగులు రాగా, వారిలో 30 మంది కల్లు బాధితులే ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిత రాయిరాల తెలిపారు.కాగా, మంగళవారం ఆస్పత్రికి వచ్చిన 40 మంది కల్లు బాధితుల్లో ముగ్గురిని అడ్మిట్ చేసుకుని, మిగతా 37 మందికి మందులు ఇచ్చి పంపించి వేశామని పేర్కొన్నారు. బుధవారం వచ్చిన వారిలో కూడా వ్యాధి అంత తీవ్రంగా ఏమీ లేదని, వారికి శుక్రవారం పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చి పంపిస్తామని అన్నారు.


