![]()
మన భద్రాద్రి(ఇంటర్నేషనల్) వెబ్ డెస్క్, మార్చి 05
సుంకాల (Tariffs) విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులపై ఇరువై ఐదు శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
పెంచిన సుంకాలు మార్చి 04 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక భారత్ పై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల నుంచి అమలు కానున్నాయి.
భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పదవి చేపట్టిన తర్వాత తాను చేసిన పనులు, సాధించిన విజయాల గురించి వివరించారు. ఇదే సమావేశంలో భారత్, చైనా సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల రెండు నుంచి అమలు చేస్తామని వెల్లడించారు.
కొన్ని దేశాలు దశాబ్దాల పాటూ అమెరికాపై టారిఫ్లు విధుస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా అన్యాయమని పేర్కొన్నారు. భారత్ తమపై 100 శాతం కంటే ఎక్కువ టారిఫ్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ మాపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తోందని, మా ఉత్పత్తులపై చైనా సగటు సుంకంమేము వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువని, ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అన్నారు. ఇప్పుడు మాకు సమయం వచ్చిందని, ఏప్రిల్ రెండు నుంచి ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని తెలిపారు. ఆయా దేశాలు మా ఉత్పత్తులపై ఎంత టారిఫ్లు విధిస్తే మేము తిరిగి అంతే వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.


