![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నదీ జలాల వినియోగంపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు సంధించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని, ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందని కేటీఆర్ విమర్శించారు. పన్నుల రూపేణా తెలంగాణ ప్రజల నుంచి రాబట్టిన నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తోన్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు బూడిద మిగిందని ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల గురించి చర్చే రాలేదని రేవంత్ రెడ్డి బుకాయించారని మండిపడ్డారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసం ఆయన గద్దెనెక్కినట్టయిందని కేటీఆర్ విమర్శించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకు దారపోస్తోన్నారని ఆరోపించారు.
కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేలిపోయిందని, తన గురువు చంద్రబాబుపై విశ్వాసం చూపించడానికి, తెలంగాణ విధ్వంసం కావలసిందేనా అని ప్రశ్నించారు. ఇలాంటప్పుడు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు?, సరిహద్దులు చెరిపేస్తే తెలంగాణా మీద ఉన్న అక్కసు చల్లారుతుందని విమర్శించారు.ఒక్క నీటి బొట్టు అక్రమంగా ఏపీకి అప్పజెప్పినా, మరో పోరాటం తలెత్తుతుందని కేటీఆర్ హెచ్చరించారు. బనకచర్ల వెనక చంద్రబాబు మతలబు నడిచిందని విమర్శించారు. తెలంగాణ జలహక్కుల్ని రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారని, నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆనాడు ఉద్యమించిన తెలంగాణ మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాల్సిందేనని అన్నారు.
పాలకుల మెడలు వంచి సంతకాలు అమలు కాకుండా ఆపాల్సిన పరిస్థితి ఎదురైందని, ఢిల్లీ పాదుషాల కుట్రలను బద్దలు కొట్టాల్సిందేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఢిల్లీ వాడిది కాదు.. పక్కోడిది కాదు.. నడమంత్రపు సర్కారుది కాదు.. తెలంగాణ ప్రజలది.. రైతులది.. వారి బిడ్డలది! మనది! మనందరిది!.. అని ఆయన ట్వీట్ చేశారు.


