![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, సెప్టెంబర్ 12
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు పది నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని, క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీవో నెం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా ఔట్సోర్సింగ్ కార్మికులు ఇచ్చిన పిలుపులో భాగంగా గుండాల ప్రభుత్వ గర్ల్స్, బాయ్స్ హాస్టల్ వర్కర్స్, పీఎంహెచ్ హాస్టల్ వర్కర్స్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ సమ్మెలో ఔట్సోర్సింగ్ కార్మికులు మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పోస్టుమెట్రిక్ హాస్టల్ లో పనిచేస్తున్న తమకు పది నెలలుగా వేతనాలు రావడం లేదని, 2022 అక్టోబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం వేతనాలు నెలకు రూ. 12,600 చెల్లించారని, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి జీవో నెం.527(2017 లో వచ్చిన జీవో) ను పంపించి పీఎంహెచ్ హాస్టల్స్ లో క్యాటరింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారని, 527 జీవో ప్రకారం క్యాటరింగ్ విధానం అమలు చేసిన ఫలితంగా వేతనాలు 12 వేల నుండి 9 వేలకు తగ్గించారని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. గతంలో పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేశారని, ప్రస్తుతం వీటిని అమలు చేయడం లేదని, వేతనాలను పెంచాల్సింది పోయి తగ్గించడం, ఉన్న సౌకర్యాలను తొలగించడం అన్యాయమని వారు వాపోయారు. జీవో నెం.527 ను రద్దు చేసి, పాత పద్ధతిలోని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో తోలెం లక్ష్మి, పొమ్మేళ లక్ష్మి, జి వెంకట నరసింహ, పార్వతి, కే పార్వతి, బాలయ్య, సమ్మయ్య, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.


