![]()
కంటి వెలుగు కార్యక్రమానికి వాహన బిల్లు రాక ఇబ్బందులు
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూలై 21
గత ప్రభుత్వంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని సులానగర్ పీ హెచ్ సీ కి 36 గ్రామపంచాయతీలకు కంటి వెలుగు కార్యక్రమానికి వెళ్లే సిబ్బంది ప్రయాణానికి నెలకి 33,000 రూపాయలతో ఒప్పందం చేయించుకొని స్థానిక పీ హెచ్ సీ డాక్టర్ దినేష్ బిల్లులు కాకుండా చేస్తున్నారని ఆదివారం వాహనదారులు రామిశెట్టి వీరయ్య, కొత్త చిట్టి రాజులు ఆవేదన వ్యక్తం చేశారు.
కోయగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత సంవత్సరం కంటి వెలుగు కార్యక్రమానికి రెండు టాటా మ్యాజికులను సొంత డీజిల్, డ్రైవర్ ను పెడితే, వాహనాలకు ఖర్చులు అన్ని మావే, నెలకు 33 వేల రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం ప్రకారం వాహనాలను పెట్టామని, ఈ కార్యక్రమం అయిపోయి సంవత్సరం కావస్తున్నా, కావాలని బిల్లులు రాకుండా స్థానిక డాక్టర్ దినేష్ చేశారని వారు వాపోయారు. కంటి వెలుగు కార్యక్రమంలో వాహనాలు పెట్టి వ్యక్తిగతంగా, మాపై పగ సాధించుటకు అలా డాక్టర్ ఆపారని, మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ టాటా మ్యాజిక్ లో డీజిల్, డ్రైవర్, వాహన మెయింటినెన్స్ ఖర్చులు అప్పులు తెచ్చి పెట్టామని, ప్రోగ్రాం అయిపోయిన వెంటనే బిల్లులు చేస్తామని చెప్తేనే మేము వాహనాలు పెట్టామని, రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో బిల్లులు పూర్తిగా చేశారని వారు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అన్ని పీ హెచ్ సీ లకు కిరాయికి పెట్టిన వాహనాలకు బిల్లులు చేశారని, కానీ టేకులపల్లి మండలం సులానగర్ పీ హెచ్ సీ లో రెండు మ్యాజిక్ లకు సుమారుగా 2 లక్షల రూపాయల వరకు బిల్లులు చేయాల్సి ఉండగా ఇంతవరకు పూర్తి కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై డీఎంహెచ్ఓను అనేకసార్లు, జిల్లా కలెక్టర్ ను రెండు సార్లు కలిసినా, సంవత్సరం పూర్తయినా ఇంతవరకు బిల్లులు రాకపోవడంతో వాళ్లకు సొంత ఖర్చులతో డీజిల్, రోజు డ్రైవర్లు, వాహనాన్ని పెడితే, డబ్బులు కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు వాహనాలు తీసుకెళ్లారని వారి బాధను చెప్పుకున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు మా బిల్లులు ఇప్పించాలని, స్థానిక డాక్టర్ దినేష్ పై చర్యలు తీసుకోవాలని పత్రికా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని వారు అన్నారు.


