![]()
-వ్యాపారాలపై మొగ్గు చూపుతున్న ఆర్టీసీ సంస్థ
-శిథిలావస్థకు చేరిన మండల ఆర్టీసీ బస్టాండ్
-గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
-బస్టాండ్ ఆవరణలో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్
మండలం కేంద్రంలో ఎన్నో ఏళ్ల క్రితం బస్టాండ్ లేక స్థలం కోసం ఇబ్బందిపడుతుంటే చండ్రగొండ మండలంలోని కాపుగంటి రంగయ్య తన స్థలాన్ని బస్టాండ్ కోసం విరాళంగా ఇచ్చారు. అప్పటినుంచి మండలంలో ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉండటంతో మండల ప్రజలు ఎంతో సంతోషించారు. ఇక్కడి నుండి విజయవాడ, రాజమండ్రి, తిరుపతికి ప్రయాణీకులు చాలామంది ప్రయాణించేవారు. ఎంతో దూరం నుంచి కూడా వచ్చి చండ్రుగొండ మండల బస్టాండ్ ఆవరణలో ఉన్న హోటల్స్ లో టిఫిన్, భోజనం కొరకు ఇక్కడే ఆగి భోజనం చేసి వెళ్లిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి పేరు ప్రతిష్టలు ఉన్న బస్టాండ్ ని ఈరోజు ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యకాలాపాలకు నిలయంగా మార్చారు. విజయవాడ, తిరుపతి వెళ్లాలన్న సమయానికి బస్సు ఉంది అన్నట్లుగా ఉండేది అప్పట్లో, కానీ ఇప్పుడు బస్టాండ్ ఆవరణలో కూర్చున్నా కూడా బస్సులు బస్టాండ్ లోకి రాకుండా కనీసం బస్టాండ్ ఎదురుగా కూడా ఆగకుండా వేరే స్థలం దగ్గర బస్సు ఆగడంతో బస్టాండ్ ని ఎవరు గుర్తించడం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. ఒకవైపు బస్టాండ్ ఆవరణ మొత్తం వ్యాపార సంస్థలకి ఆర్టీసీ అధికారులు లీజ్ కి ఇవ్వడంతో వ్యాపార అడ్డగా మారింది. మరోవైపు శిథిలావస్థలో ఉండటం వలన మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మండలంలోని వ్యాపారస్థులు వాళ్లు వాడుకున్న చెత్తని వేసేందుకు స్థలంగా మారిపోయింది. ఆవరణలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిసినా కూడా మండల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బస్టాండ్ కి ఎన్ని నిధులు వచ్చినా కూడా ఆర్టీసీ అధికారులు మాత్రం ఉపయోగించకుండా వ్యాపారం పైనే మొగ్గు చూపడం గమనార్హం. దీంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని విరాళంగా ఇచ్చిన దాతల పేర్లు కూడా చెడగొడుతున్నారని, బస్టాండు రూపురేఖలు పూర్తిగా మార్చేశారని, ఇక్కడ బస్టాండ్ లేదు అన్నట్టుగా పూర్తిగా వ్యాపారాలకి మొగ్గు చూపడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పత్రికా కథనాల్లో ఈ సమస్య వచ్చిన కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంపై అసలు దీనికి కారణం ఎవరని, అభివృద్ధిని ఆపేదెవరని, ఆ ముసుగు మనిషి ఎవరని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క అధికారి ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని, ఒక్క అధికారి అయిన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసి మా బస్టాండ్ కి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చేసే అధికారి కోసం వేచి చూస్తున్నామని గ్రామస్థులు అంటున్నారు.


