![]()
కర్ణాటకలోని మంగళూరు పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో రూ.275 కోట్ల విలువైన 37 కిలోల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. దీనితో సంబంధం ఉన్న ఇద్దరు దక్షిణాఫ్రికా జాతీయులను అరెస్ట్ చేశారు. నిందితులు ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమాన మార్గాల ద్వారా ఎండీఎంఏను అక్రమంగా రవాణా చేస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఇంటలిజెన్స్ సమాచారం మేరకు, మంగళూరు సీసీబీ అధికారులు బెంగళూరులోని నీలాద్రి నగర్ ప్రాంతంలో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. వారు రెండు ట్రాలీ బ్యాగుల్లో డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అంతేగాక వారి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు ట్రావెల్ బ్యాగులు, రెండు పాస్పోర్ట్లు, రూ. 2,18,460 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన ఇద్దరు నిందితులను దక్షిణాఫ్రికాలోని అగ్బోవిల్లెకు చెందిన బాంబా ఫాంటా, ప్రిటోరియాకు చెందిన అబిగైల్ అడోనిస్ గా గుర్తించారు. వీరు ప్రస్తుతం న్యూఢిల్లీలోని మాల్వియా నగర్లో నివసిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లను అరికట్టడానికి పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. గతేడాది మంగళూరు తూర్పు పోలీసులు పంప్వెల్ సమీపంలో ఎండీఎంఏ అమ్మినందుకు హైదర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే భారీగా డ్రగ్స్ పట్టబడ్డాయి.


