![]()
-వారు కనుమూసి 30 ఏళ్లు దాటినా ఎర్రజెండాలో కదులుతూనే ఉన్నారు
-సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సీతారామయ్య
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 29
గుండాల మండలం కాచనపల్లిలో ప్రజా ఉద్యమ నాయకులు నంబూరి సీతారామారావు, నోముల పరుషు రాములు, చింతా లక్ష్మి, సూసేనలతో పాటు ప్రతిఘటన పోరాట నాయకుడు కోటన్నను 1991 మే 29 న కసాయి రాజ్యం కాల్చి చంపి బూటకపు ఎన్కౌంటర్ కథనం అళ్లిందని, నాడు ఆదివాసీ పీడిత ప్రజల కోసం ఉద్యమాల బాటలో పయనిస్తున్న నాయకులను చంపటం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయగలమని, పాలకులు కలగన్నారని, వారు కనుమూసి 33 ఏళ్లయిన పోరాట బాటలో ఎగురుతున్న ఎర్రజెండాల్లో నిత్యం తోడుగా ఉన్నారని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏరియా నాయకులు జె సీతారామయ్య అన్నారు. దోపిడి, ఆకలి ఉన్నంతకాలం ప్రజా పోరాటాలకు చావులేదని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. కాచనపల్లిలో కాల్చి చంపబడిన అమరుల 33 వ వర్ధంతి సందర్భంగా టేకులపల్లి మండల కేంద్రంలో కాచనపల్లి అమరుల స్తూపం వద్ద పార్టీ నాయకత్వంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భూక్య హర్జ్య అధ్యక్షతన జరిగిన సభలో సీతారామయ్య మాట్లాడుతూ దోపిడి వ్యవస్థ నిర్మూల కోసం, ప్రజారాజ్య స్థాపన కోసం గత 40 ఏళ్లుగా జరుగుతున్న ప్రతిఘటన పోరాటంలో అనేకమంది నాయకులు తమ నిండు జీవితాలను త్యాగం చేశారని ఆయన అన్నారు. పోట్ల రామ నరసయ్య, నీలం రామచంద్రయ్య, జంపాల ప్రసాదు, శ్రీహరి మొదలు ఎల్లన్న, బాటన్న, దొరన్న, మురళి, లింగన్న, పాషన్న, ముస్మీ అమరవీరుల వరకు అనేకమంది వీరులు మరణించి, ఎర్రజెండాను మరింత ఎరుపు ఎక్కించి, పోరాటాలకు పదును పెట్టారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం కోసం, దోపిడి వ్యవస్థ నిర్మూలన కోసం అమరులు కలలుగన్న నూతన ప్రజాస్వామిక విప్లవం సాధన కోసం మరిన్ని పోరాటాలను నిర్మించాలని, అది మాత్రమే అమరులకు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పివైయల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్, మండల నాయకులు భూక్య నర్సింగ్, బోడా మంచా, ధారవత్ భీక్య, తోటకూరి సతీష్, గుగుతోతు నాగేశ్వరరావు, మాలోత్ వసంతరావు, చందర్, వెంకన్న, జాను, మంగీలాల్, తదితరులు పాల్గొన్నారు.


