![]()
కేంద్ర కులగణన ప్రకటనపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
ఖమ్మం, మన భద్రాద్రి బ్యూరో
కేంద్ర ప్రభుత్వం కులగణనపై తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని మల్లన్నపాలెం గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిగా కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని నిర్ణయాల్లో కులగణనను పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.
కులగణన సర్వే ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న డిమాండ్ చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. కానీ అప్పట్లో కేంద్రం స్పందించకపోయినప్పటికీ, ఇప్పుడు ప్రజల ఒత్తిడికి తలొగ్గి కులగణన చేపట్టేందుకు ఒప్పుకున్నట్టు తెలిపారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో జరిగిన కులగణనను విమర్శించిన బీజేపీ ఇప్పుడు అదే మార్గాన్ని అనుసరించడాన్ని సానుకూల పరిణామంగా అభివర్ణించారు. రాష్ట్రంలోని బీసీలు ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.


