![]()
-వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
కొత్తగూడెం/దమ్మపేట, మన భద్రాద్రి జిల్లా స్టాఫర్, ఆగస్టు 20
సోమవారం దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి, సీసీఎస్ అధికారులు, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అచ్యుతాపురం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి ఎంహెచ్ 04 1144 నంబరు గల లారీని తనిఖీ చేయగా లారీ క్రింది భాగంలో నిషేధిత గంజాయి అమర్చి పైన కెమికల్ లోడ్ మాత్రమే కనిపించే విధంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. దమ్మపేట సమీపంలో పట్టుబడ్డ గంజాయి కేసు వివరాలు ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. పట్టుబడ్డ లారీలో కింద గంజాయి, పైన కెమికల్ బస్తాలు ఉంచి రవాణా చేస్తున్నారని, 247 ప్యాకెట్లలో 508 కిలోల గంజాయిని ఒరిస్సాలో కొనుగోలు చేసి మహారాష్ట్రకు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. దీని విలువ సుమారుగా రూ.1,77,99,500(ఒక కోటి డబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు) ఉంటుందని పేర్కొన్నారు. వెహికల్ పై భాగంలోని 280 బస్తాల కెమికల్ విశాఖపట్నం పూణేకి చెందిన హీదా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చేరవేయాల్సి ఉంది. వీటి క్రింది భాగంలో ముద్దాయిలు ఎవరికీ అనుమానం రాకుండా 20 బస్తాలలో 247 ప్యాకెట్ల గంజాయిని దాచి ఉంచి వాటిని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించారని, పట్టుబడిన ఆరుగురు నిందితులతో పాటు గంజాయిని ఒరిస్సాలో సప్లయి చేసిన వారిపై మరియు రిసీవర్స్ పై కూడా కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. లారీతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనపర్చుకున్నామని, వారిని జ్యూడీషియల్ రిమాండుకు తరలించడం జరిగిందని అన్నారు. మహారాష్ట్రకు చెందిన ధ్యానేశ్వర్ వితా జాదవ్, (పెడ్లర్, రిసీవర్)
అసిమ్ అసద్ షేక్,
షాలిక్ ఫిరోజ్ బబ్లూ,
అబ్దుల్ రెహమాన్, లాల్ అహ్మద్, అశోక్ లే ల్యాండ్ లారీ డ్రైవర్ అజీజ్ సయ్యద్ లను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. శ్రీను(సరఫరాదారుడు), ప్రకాష్ ధ్యానేశ్వర్, అబ్దుల్ రహమాన్, ఉస్మాన్ దారోగా, మోహితే జై సింగ్, మోహితే నందు, పండిట్, మంగళ్ల్ మోహిత్ ల పై కూడా కేసు నమోదు చేశామని, వారు పరారిలో ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట సీఐ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ సీఐ సత్యనారాయణ, టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు.


