![]()
-సీఐ, ఎస్సై ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు దోమ తెరల పంపిణీ
-ప్రజల భద్రతే పోలీసుల బాధ్యత ఎస్పీ రోహిత్ రాజ్
చర్ల, మన భద్రాద్రి న్యూస్
మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సీఐ రాజు వర్మ తమ సిబ్బందితో కలిసి శుక్రవారం మారుమూల గ్రామమైన కోర్కట్ పాడు గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గ్రామం కావడంతో ప్రతి ఇల్లు, పశువుల పాకలు, గడ్డివాముల ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఐ రాజ వర్మ గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామంలోకి అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని, నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే పోలీస్ అధికారులకు తెలియజేయాలని, పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, యువత చెడు మార్గాలలో నడవకుండా సన్మార్గంలో నడవాలని, ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని గ్రామస్థులకు సూచించారు.
గ్రామంలోని 40 కుటుంబాలకు దోమతెరలు పంపిణీ
వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గ్రామంలోని 40 కుటుంబాలకు దోమతెరలను సీఐ రాజవర్మ, ఎస్సై నర్సిరెడ్డిలు పంపిణీ చేశారు. పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని, గ్రామాల్లోని సమస్యలను నేరుగా తమకు తెలియపరచవచ్చని, గ్రామస్థులకు ఎంతటి సహకారాన్నైనా మా పోలీస్ శాఖ అందిస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బంది, సివిల్ పోలీసులు, గ్రామస్థులు, పాల్గొన్నారు.


