![]()
గంజాయి, డ్రగ్స్ నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం
- యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వెయ్యాలి
- మాదక ద్రవ్యాలను అరికడదాం.. సమాజాన్ని కాపాడుదాం
- భద్రాచలం ఎఎస్పీ అంకిత్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అరికడదాం.. సమాజాన్ని కాపాడుదాం అనే కార్యక్రమంతో యువతలో చైతన్యాన్ని నింపడానికి డివైఎఫ్ఐ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా శనివారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాచలం ఎఎస్పీ అంకిత్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా మాదక ద్రవ్యాల వినియోగం వద్దు అనే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరికృష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, అభివృద్ధి యువతపై ఆధారపడి ఉందని, దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం అవసరం, దేశం ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువత సొంతమని, మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే అని, దురదృష్టవశత్తు నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తెలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్విర్యమై, నిస్తేజంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతుందని, యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వెయ్యాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించనుందని తెలిపారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా వీటిని పూర్తిగా నిషేధించే విధంగా చట్టం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా విస్తరిస్తుందని, అంతేకాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ప్రత్యేకంగా ఏజన్సీ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు వివిధ రాష్ట్రాల సరిహద్దుల నుంచి పూర్తిగా విస్తరిస్తున్నాయని, బడి పిల్లల నుంచి కాలేజీ వరకు ఈ మహమ్మారి చేరుకుందని, బడి పిల్లల నుంచి యూనివర్సిటీ దాకా, రోజు కూలి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ముఖ్యంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలే కాకుండా మధ్య తరగతి వారు కూడా ఈ మత్తు మహమ్మారికి బానిసలౌతున్నారని అన్నారు. సామాజిక న్యాయం, సాధికారతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో 29 లక్షల మంది మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిసింది. గంజాయి కొనడానికి డబ్బులివ్వలేదని కన్నవారిని కడతేర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పూర్తిస్థాయిలో మధిర నియోజక వర్గం, జిల్లాలో ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు విద్యా సంస్థలలో సదస్సులు ప్రభుత్వం నిర్వహించాలని, పూర్తి అవగాహన తీసుకుని రావాలని, మాదకద్రవ్యాలు వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని పీడి యాక్ట్లు నమోదు చేసి యువతను కాపాడాలని, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు డివైఎఫ్ఐ జిల్లాలో ఈనెల 01 నుంచి ఆగస్టు 18 వరకు జిల్లాలో సదస్సులు, ర్యాలీలు మరియు సంతకాలను సేకరణలు సేకరించి గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకై యువతను మంచి దారిలో నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తామని అన్నారు.
అనంతరం భద్రాచలం ఎఎస్పీ అంకిత్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ తీసుకున్న నిర్ణయం మంచిదని.. గంజాయి, డ్రగ్స్ నిర్మూలించాలంటే జిల్లాలో ఉన్న అందరి సహకారం అవసరమని, గంజాయి మొక్కలు నాటే వారిపై, డ్రగ్స్ వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, చట్టపరమైన కేసులు నమోదు చేసే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య తీసుకున్న ” గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం ” యువతను ఈ మాదక ద్రవ్యాలపై చెడు దారిన పట్టకుండా అందరి సహాయ సహకారాలు అవసరమని డివైఎఫ్ఐ నిర్వహించే సదస్సులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తూ భాగస్వాములు కావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు యస్. భూపేందర్ పాల్గొన్నారు.


