![]()
-13 లక్షల రివార్డ్ గల ఇద్దరు కీలక మావోయిస్టులు హతం
చర్ల, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 16
ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ లో మళ్ళీ తూటా పేలింది. నారాయణపూర్, కొండగావ్ జిల్లాల సరిహద్దులోని కిలామ్ బర్గం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ బలగాలు మంగళవారం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్లాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. చీకటి పడటంతో భద్రత బలగాలు అడవుల్లోనే ఉండిపోయాయి. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో శోధన ఆపరేషన్ చేయగా ఇద్దరు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 తుపాకీ, ఇతర ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల ఘటనను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధ్రువీకరించారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. తూర్పు బస్తర్ ప్రాంతంలో భయంకర మావోయిస్టులు ఇద్దరు ఈ ఎదురుకాల్పులో హతమైనట్లు ఆయన వెల్లడించారు. తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు హల్దర్, ఏరియా కమిటీ సభ్యుడు రమే గా గుర్తించినట్లు వెల్లడించారు. వీరిద్దరిపై రూ. 13 లక్షల రివార్డు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ ఎన్కౌంటర్లో 148 మావోయిస్టులు హతమయ్యారు.


