![]()
-టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్
జూలూరుపాడు, మన భద్రాద్రి న్యూస్, ఏప్రిల్ 20
మండల కేంద్రంలో సహాయ కార్మిక అధికారి (ఏఎల్ఓ) కార్యాలయం ఏర్పాటు చేసి కార్మికులకు సేవలు అందించాలని
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ఏదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. ఆదివారం జూలూరుపాడులో గోపాలరావు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా హమాలీలు, గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో, మోటార్ కార్మికులు, మిషన్ భగీరథ కార్మికులు, పాఠశాల కార్మికులు, హాస్టల్ వర్కర్స్ మొదలగు రంగాల్లో సుమారు రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి కార్మిక శాఖ ద్వారా అందించే సౌకర్యాలు సత్వరమే అందాలంటే మండల కేంద్రంలో ఏఎల్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని గోపాలరావు ప్రభుత్వాన్ని కోరారు. జూలూరుపాడు మండలంతోపాటు ప్రక్కన ఉన్న చండ్రుగుండ మండలానికి చెందిన కార్మికులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ హలో కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్న ఉప మార్కెట్ శాశ్వత మార్కెట్ గా ఏర్పాటు చేసి, కార్మికులకు, రైతులకు షెడ్లను నిర్మాణం చేపట్టాలని, భద్రత ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.


