![]()
బెంగళూరు, మన భద్రాద్రి వెబ్ డెస్క్: బెంగళూరులో సైబర్ నేరగాడు ఇద్దరు అమాయక మహిళలకు జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మహిళలను బురిడీ కొట్టించడమే కాకుండా.. ఇద్దరు మహిళలను ఏకంగా తొమ్మిది గంటల పాటు వీడియో కాల్లో ఉంచాడు. నగ్నంగా కూర్చోబెట్టి బెదిరించిన ఈ దారుణ ఘటన మరతహళ్లి ప్రాంతంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- ఏం జరిగిందంటే..?
థాయ్లాండ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ నెల 17న బెంగళూరుకు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఓ అపరిచిత నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాము పోలీస్ అధికారులమని పరిచయం చేసుకుని.. జెట్ ఎయిర్వేస్కు సంబంధించిన అక్రమ నగదు బదిలీలో భాగమయ్యారని చెప్పుకొచ్చాడు.
వెంటనే ఆమెను కొలాబా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని బెదిరించాడు. తాను చాలా సంవత్సరాలుగా భారత్లో లేనని చెప్పినప్పటికీ.. నేరగాడు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. చివరకు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 58,477 బదిలీ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా దారుణానికి ఒడిగట్టాడు.
బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని వాట్సాప్ వీడియో కాల్లోకి రమ్మని ఆదేశించాడు. వారిని గుర్తుంచేందుకు పుట్టుమచ్చలు చూడాలని చెప్పి.. ఇద్దరినీ నగ్నంగా మారమని బెదిరించాడు. సుమారు 9 గంటల పాటు కాల్ను కట్ చేయకపోవడంతో.. చివరకు బాధిత మహిళలు ధైర్యం చేసి ఫోన్ను ఆఫ్ చేశారు. కొంత సమయం తర్వాత తాము మోసపోయామని గ్రహించిన బాధితులు, బెంగళూరు తూర్పు విభాగం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై నిన్న కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ… డిజిటల్ అరెస్ట్ అనేది నీటిమీద బుడగలాంటిదని అన్నారు. అలాంటి బెదిరింపులను ప్రజలు అస్సలు నమ్మవద్దు అని కోరారు. అనుమానాస్పద కాల్స్ను వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని కోరారు.


