![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై రాచకొండ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.మల్కాజిగిరి ఏసీపీ ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 11:30 మధ్యలో దాదాపు 25-30 మంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు మేడిపల్లి లోని క్యూ న్యూస్ స్టూడియో వద్దకు వచ్చారు.
అక్కడ మల్లన్న టీం సభ్యులతో తోపులాట చోటుచేసుకోగా, ఇరుపక్షాల వారు గాయాలపాలయ్యారు.ఈ ఘటనలో మల్లన్నకు సంబంధించిన గన్ మెన్ ఒకరు గాల్లో 6 రౌండ్ల వార్నింగ్ కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఆధారంగా 9 సెక్షన్లు
తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో తనను చంపేందుకు ప్రయత్నించారని, తెలంగాణ జాగృతి నాయకులు, మాజీ సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రేరణతో దాడికి దిగారని ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లతో పాటు మొత్తం 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జాగృతి ఫిర్యాదుపై ఆర్మ్స్ యాక్ట్ నమోదు
ఇక మరోవైపు జాగృతి నాయకుడు లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్ ఫిర్యాదు మేరకు మల్లన్న, మల్లన్న అనుచరులు కత్తులు, తుపాకులతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మహిళా కార్యకర్తల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆర్మ్స్ యాక్ట్తో పాటు మరో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. మల్లన్నపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గొడవకు కారణమైన వ్యాఖ్యలుపోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించిన కోటాలపై ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్తతకు కారణమని భావిస్తున్నారు. “బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే కవిత ఎందుకు సంబరాలు చేసుకుంటుంది? నీవేమన్నా బీసీ వా? నీతో కంచం పోత్తు ఉందా? మంచం పోత్తు ఉందా?” అనే వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని అధికారులు తెలిపారు.
గన్ మెన్ కాల్పులపై విచారణ
తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్ మెన్లలో ఒకరు బాలకృష్ణ, మరొకరు శ్రీనివాస్. ఘటన జరిగిన సమయంలో శ్రీనివాస్ క్యాబిన్ వద్ద ఉండగా, బాలకృష్ణ మల్లన్నను దగ్గర ఉన్నాడు. ఈ క్రమంలోనే జాగృతి కార్యకర్తలు లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు బాలకృష్ణ గన్ మెన్ గాల్లో ఆరు రౌండ్ల వార్నింగ్ ఫైర్ చేశాడు.
పోలీసులు ఇద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. తుపాకుల్ని బెల్ ఆఫ్ ఆర్మ్స్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు కేసులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియాలో వెలువడిన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.


