![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనాలను కల్పించే నిర్ణయం ఇది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (AOVN) పథకం కింద సీట్లను భారీగా పెంచింది. ఇప్పుడు ఉన్న సీట్లను రెట్టింపు చేసింది.ప్రస్తుతం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఉండే సీట్ల సంఖ్య.. 210. ఇంతమంది విద్యార్థులు మాత్రమే ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యాను అభ్యసించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించేది. ఇప్పుడు ఈ సంఖ్యను భారీగా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. 500లకు పెంచింది.
ఈ మేరకు జీవో జారీ అయింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఈ జీవోను జారీ చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం 500 మంది వరకు అర్హులైన ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉండే యూనివర్శిటీల్లో చదువుకోవడానికి అవకాశం కల్పించినట్టయింది. దీనికి అనుగుణంగా బడ్జెట్ ను కూడా పెంచనుంది తెలంగాణ ప్రభుత్వం.తెలంగాణలోని ఎస్సీ విద్యార్థులకు ఇది అతిపెద్ద ప్రోత్సాహకంగా భావిస్తోన్నారు. ఈ చర్య విదేశీ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కుల (SC) విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తుందని, వారి ఓవర్సీస్ విద్య కలలను సాకారం చేసినట్టవుతుందని చెబుతున్నారు.


