![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: దేశంలో రోజు రోజుకీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చివరికి ఇంట్లో సైతం వారికి రక్షణ లేకుండా పోతుంది. వావి వరుసలు మరిచి, కన్నబిడ్డలా చూసుకోవాల్సిన బంధువులే కామాంధులుగా మారి దారుణాలను పాల్పడుతున్నారు.
తాజాగా కాకినాడ (Kakinada) జిల్లాలోని ఓ గ్రామంలో ఘోర ఘటన వెలుగుచూసింది. పదేళ్ల బాలికపై సొంత బాబాయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేని సమయంలో అతడు బాలికను ఒంటరిగా చూసి అఘాయిత్యానికి యత్నించినట్టు పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు తెలియజేయగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై పొక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. కుటుంబంలోనే బాలికలు సురక్షితంగా లేరనే వాస్తవాన్ని మరోసారి బయటపెట్టింది. చిన్నారులపై ఇలాంటి దాడులు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.


