![]()
- తీసుకెళ్లిన తర్వాతే అతనెవరో తెలిసింది: రజనీ
మన భద్రాద్రి సినీ న్యూస్: ఒకానొక సమయంలో తాను కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి అన్న మాటలకు ఎంతో బాధపడ్డానని అగ్ర కథానాయకుడు రజనీకాంత్ అన్నారు.
ఆయన కీలక పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’ (Coolie). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న (coolie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలో ట్రైలర్ విడుదల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఒక సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.”ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే, ఒక వ్యక్తి నన్ను పిలిచి, ‘నా లగేజ్ను టెంపో వరకూ తీసుకెళ్తావా’ అని అడిగాడు. నేను సరేనన్నాను. అతన్ని పరిశీలించి చూస్తే, తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. కొన్ని క్షణాల తర్వాత తను నేనూ ఒకే కాలేజ్లో చదువుకున్నామని అర్థమైంది. అప్పట్లో అతడిని నేను సరదాగా ఆటపట్టించేవాడిని. లగేజ్ టెంపో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ.2 చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు. ‘అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు. నీకు ఆ రోజులు గుర్తున్నాయా?’ అని అడిగాడు. నాకు కన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో ఎంతో బాధపడిన సందర్భమది” అని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.
అనంతరం ‘కూలీ’ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను రియల్ హీరో అంటూ అభినందించారు. ”కూలీ’ సినిమాకు సంబంధించి రియల్ హీరో లోకేశ్ కనగరాజ్. ఈ మూవీపై అంచనాలను పతాకస్థాయికి తీసుకెళ్లారు. ఒక విజయవంతమైన కమర్షియల్ దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో నటీనటులతో ఒక తుపాను సృష్టించాడు. లోకేశ్ ఈ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతూ.. ‘నేను కమల్ ఫ్యాన్ సర్’ అన్నాడు. ‘నేను నిన్ను అడిగానా’ అని అన్నాను. ‘లేదు సర్. మామూలుగా చెప్పాను’ అన్నాడు. ‘ఈ స్టోరీలో పంచ్ డైలాగ్లు ఉండవు’ అని ముందే చెప్పాడు. అప్పుడే అర్థమైంది ఇదొక ఇంటెన్సిటీ డ్రామా” అని రజనీకాంత్ అన్నారు.
ఇందులో కీలక పాత్ర పోషించిన ఆమిర్ఖాన్ మాట్లాడుతూ.. ‘లోకేశ్ నన్ను కలిసినప్పుడు ఈ కథ, రిలీజ్ డేట్ గురించి ఆయన్ను అడగలేదు. ఎందుకంటే ఇది రజనీసర్ ఫిల్మ్. అంతకుమించిన అంశం ఇంకేముంటుంది. నేను లోకేశ్ను అడిగింది ఒక్కటే.. ‘షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతున్నాం” అని చెప్పుకొచ్చారు. నాగార్జున, ఆమిర్ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, మహేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘కూలీ’తో లోకేశ్ మరో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


