![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్:
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారు. పోలీసుల ఎదుట లొంగినపోయిన మొత్తం యాభై మంది మావోయిస్టుల్లో పద్నాలుగు మంది తలలపై రూ. 68 లక్షల రివార్డు ఉన్నట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు.
ఈ కీలక పరిణామం ప్రధానమంత్రి నరేంద్ర మోధీ ఛత్తీస్గఢ్ పర్యటనకు ముందు చోటుచేసుకుంది. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు పద్దెనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్తో మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గత మూడు నెలల కాలంలో మొత్తం వంద మందికి పైగా మావోయిస్టులు మరణించారని అధికారులు తెలిపారు.
తాజా ఘటనతో మావోయిస్టు ఉద్యమానికి మరింత దెబ్బతగిలినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ దళాల ఒత్తిడి, ఉద్యమంలో ఏర్పడిన విభేదాల కారణంగా మావోయిస్టులు లొంగిపోతున్నట్లు బీజాపూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వం మావోయిస్టులకు పునరావాస అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో లొంగుబాటు సంఖ్య పెరుగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లొంగిన మావోయిస్టులకు ఉపాధి కల్పన, భద్రతా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని భద్రతా బలగాలకు మరో విజయంగా మారింది. భవిష్యత్తులో మరికొంత మంది ప్రధాన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.


