![]()
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూలై 24
ప్రగతిశీలా యువజన సంఘం(పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ కౌన్సిల్ పాల్వంచ పట్టణంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని నడిమిగూడెం గ్రామానికి చెందిన పూనెం మంగయ్యను ఆ సంఘం యొక్క జిల్లా అధ్యక్షులుగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పూనెం మంగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని, రాష్ట్రంలో 40 శాతానికి పైగా ఉన్న యువత ఉద్యోగ, ఉపాధ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఎంతో మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసించి, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి పెట్టి, అన్ని సౌకర్యాలు పేద ప్రజలకు కల్పించాలని కోరారు. జూలై 27 న హైదరాబాద్ లో జరిగే పీవైఎల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.


