![]()
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలి
- సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
చర్ల, మన భద్రాద్రి న్యూస్
ఆరు గ్యారంటీల పేరుతో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తక్షణమే ఆరు గ్యారెంటీలని అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో అధికారులు గ్రామాలలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సమయం తీసుకోకుండా వెంటనే అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే పేరుతో అనేక సమస్యలను సర్వేలు చేసి ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని, ఈ ప్రభుత్వం కూడా వారి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని లేనిచో ప్రజల తరపున ఆందోళన చేయవలసి వస్తుందని వారు అన్నారు. ఎలాంటి తారతమ్య బేధాలు లేకుండా ప్రజలందరికీ ప్రజా పథకాలు అందేవిధంగా చూడాలని వారన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని, ఇల్లు, రేషన్ కార్డు, భూమి లేకుండా అనేకమంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, ఈ ప్రభుత్వం అయినా ప్రజా పాలన పేరుతో తీసుకున్న ప్రతి దరఖాస్తుని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, అలాగే ప్రతివారం ఇలా ప్రజాదర్బార్ పేరుతో ప్రజాపాలన నిర్వహించాలని వారు కోరారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కేసుల్లో ఉన్న వాళ్లే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిరి నరేష్, కనితి భాను ప్రకాష్, బుర్ర సమ్మక్క, అలవాల రమణ, తులసి, రాణి, దుర్గమ్మ, రాజమ్మ, రమేష్, రాజు, రవి, కార్తీక్, సుబ్బులు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


