![]()
- కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు (కేకే)
న్యూఢిల్లీ, మన భద్రాద్రి బ్యూరో, జులై 03
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ ఎంపీ కే కేశవరావు (కేకే) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ సమక్షంలో కేకే లాంఛనంగా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కేకే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. అంతకు ముందు కేకే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించారు. అనంతరం ఖర్గే నివాసానికి చేరుకుని ఆయన సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న కేకే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేకే ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించగా, రేవంత్ ఇన్విటేషన్ మేరకు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు కేకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కేశవరావు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకే, ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.


