![]()
-శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లోకి చేరిక
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, జూలై 13
బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ, షాకుల మీద షాకులు తగులుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ రోజు కాంగ్రెస్ తీర్థం పూచ్చుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ముగ్గురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు కూడా కాంగ్రెస్లోకి చేరారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్లో చేరుతున్నారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38 కి చేరింది. ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న శుక్రవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్లోకి చేరడం, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.


