![]()
న్యూఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్.. దానికి ప్రతీకారంగా పాకిస్థాన్ చేసిన దాడుల్లో 5యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన జోక్యంతోనే ఇరుదేశాల మధ్య వివాదం సమసిందని పునరుద్ఘాటించారు. ట్రంప్ జోక్యం వార్తలను భారత్ ఇదివరకే ఖండించిన విషయం తెలిసిందే! అయితే, తానే యుద్ధాన్ని ఆపానని, గడిచిన ఆర్నెల్లలో ఎన్నో ఘర్షణలను అడ్డుకున్నట్లు ట్రంప్ తాజాగా మళ్లీ ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత కూలినట్లు చెబుతున్న ఐదు యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.శుక్రవారం రాత్రి ట్రంప్ తన అధికారిక నివాసం(వైట్హౌ్స)లో రిపబ్లికన్ సెనేటర్లకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”భారత్-పాక్ ఘర్షణలో 4-5 యుద్ధ విమానాలు కూలిపోయాయి. ఐదు అని నాకు గుర్తుంది.
అవి రెండూ(భారత్, పాక్) అణ్వాయుధ దేశాలు. పరిస్థితి జటిలంగా మారుతుండడంతో మేం వాణిజ్యం ద్వారా సమస్యను పరిష్కరించాం” అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దీనిపై ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది.”మోదీజీ.. ఆ ఐదు విమానాల సంగతేంటి?” అని రాహుల్ ఎక్స్లో పోస్టు చేశారు. ”పార్లమెంట్ సమావేశాలకు రెండ్రోజుల ముందు.. మళ్లీ ట్రంప్ మిసైల్ పేలింది. ట్రంప్ ఈ అంశంపై మాట్లాడడం ఇది 24వ సారి” అని జైరామ్ అన్నారు.


